గేరు మార్చి నా తడాఖా ఏంటో చూపిస్తా... వైసీపీపై ఇక జెట్ స్పీడ్ తో పోరాటమే: చంద్రబాబు

  • కుప్పంలో చంద్రబాబు పర్యటన
  • కుప్పం జగన్ జాగీరు కాదని స్పష్టీకరణ
  • కుప్పంలో వైసీపీకి డిపాజిట్ రాకుండా చేస్తానని వ్యాఖ్యలు
  • పెద్దిరెడ్డికి కూడా ఇదే పరిస్థితి తప్పదని హెచ్చరిక
  • తెగించి ముందుకు పోవాలని కార్యకర్తలకు పిలుపు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులకు ప్రతికూల ఫలితాలు ఎదురైన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని, రాజధాని, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు అన్నీ పోయాయని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. కుప్పంలో డబ్బు పంచి వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. కుప్పం జగన్ జాగీరు కాదని అన్నారు.

పురపాలక ఎన్నికల సందర్భంగా కుప్పంలోనే మకాం వేస్తానని, వైసీపీకి కనీసం డిపాజిట్ కూడా రాకుండా చేస్తానని హెచ్చరించారు. తాను గేరు మార్చి తడాఖా చూపిస్తానని, ఇకపై వైసీపీపై జెట్ స్పీడుతో పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యకర్తలు తెగించి ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డికి డిపాజిట్ కూడా రాకుండా చేస్తానని అన్నారు. ఎర్రచందనం, ఇసుక స్మగ్లింగ్ తో పెద్దిరెడ్డి దోచుకుంటున్నాడని ఆరోపించారు.

Chandrababu
Kuppam
Municipal Elections
Jagan
YSRCP
Telugudesam
Gram Panchayat Elections
Andhra Pradesh

More Telugu News